Rahul Gandhi: అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా.. లోక్సభలో ప్రధాని మోదీ 2 గంటలకు పైగా వన్ మ్యాన్ షో చేశారు. కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఎన్డీయే పాలనలో అభివృద్ధిపై ఏకరువు పెట్టారు. చివరాఖరున మణిపూర్ గురించి పైపైన మాట్లాడి ఇష్యూను మమ అనిపించారు. ప్రధాని తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రెస్మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్లో ఇంత హింస జరుగుతుంటే.. మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతుంటే.. సభలో మోదీ 2 గంటల పాటు టైంపాస్ చేశారని మండిపడ్డారు. తన ప్రసంగంలో నవ్వుతూ, జోకులు వేసుకుంటూ మాట్లాడారని.. ఈ వ్యవహారశైలి మంచిది కాదని తప్పుబట్టారు రాహుల్.
మణిపూర్లో అంత హింస జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని కేంద్రాన్ని నేరుగా పశ్నించారు. మణిపూర్ మండుతుంటూ చూస్తూ కూర్చున్నారని.. డివైడ్ అండ్ రూల్లో భాగంగా.. అల్లర్లు జరిగేలా మోదీ ప్రోత్సహించారని రాహుల్ ఆరోపించారు. ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు ఇచ్చుంటే.. రెండంటే రెండే రోజుల్లో మణిపూర్ హింసాకాండను ఆపేసేదని.. కానీ మోదీ అలా చేయకపోవడానికి కారణాలు ఉన్నాయని చెప్పారు.
భారతమాతను హత్య చేశారని తాను అన్నమాట నిజమేనని.. కాకపోతే ఏ అర్థంలో అన్నాననేది చూడాలన్నారు రాహుల్. ఐడియా ఆఫ్ ఇండియాను భారతమాత అంటారని.. ఆ ఇండియా అనే భావనను మణిపూర్లో హత్య చేశారని.. రాష్ట్రాన్ని రెండుగా చీల్చారని రాహుల్గాంధీ అన్నారు.