Jagan : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం జగన్ పర్యటించారు. అక్కడ నుంచే డ్వాక్రా మహిళలకు నాలుగో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు మహిళలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. 2016లో సున్నావడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారని అన్నారు. టీడీపీ హయాంలో బకాయిపెట్టిన రూ. 14 వేల కోట్లను తాము చెల్లించామన్నారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదేనని విమర్శించారు. నారా వారి చరిత్ర నారీ వ్యతిరేక చరిత్ర అంటూ సెటైర్లు వేశారు.
తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని జగన్ అన్నారు. ప్రతిపక్ష నేతల ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. ఇన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా సామాజిక న్యాయం ఉందా? అని నిలదీశారు. పేదల భవిష్యత్ గురించి చంద్రబాబు ఆలోచించారా? అని అడిగారు.
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుడిని ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిలదీశారు. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారని అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా సెటైర్లు వేశారు.
చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు మంచి జరగదని జగన్ స్పష్టం చేశారు. బాబు దళితులను చీల్చారని విమర్శించారు. ఎస్టీలకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని చెదిరించారని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలకు విలువ, విశ్వసనీయత లేదన్నారు. దోచుకోవడం.. పంచుకోవడమే ఆయన విధానమని విమర్శించారు.
పుంగనూరు ఘర్షణలపై జగన్ స్పందించారు. అంగళ్లులో చంద్రబాబు కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఒక మార్గంలో పర్మిషన్ తీసుకుని మరో రూట్లో వెళ్లారని విమర్శించారు. 47 మంది పోలీసులకు గాయాలయ్యాయి తెలిపారు. చంద్రబాబు అరాచకంతో ఓ పోలీసు కన్ను పోగొట్టుకున్నాడని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని .. మీ బిడ్డకు మీరే ధైర్యం అని అన్నారు. మేలు జరిగితే తనవెంట సైనికుల్లా నిలబడాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.