హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. శంషాబాద్లో దిశ తరహా ఘటన జరగడం కలకలం రేపుతోంది. 30 ఏళ్ల గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. శంషాబాద్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఈ ఘటన జరిగింది. మహిళను చంపేసిన తర్వాత దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళ మృతదేహం కాలిపోతోందని గురువారం అర్ధరాత్రి తమకు సమాచారం వచ్చిందని శంషాబాద్ ఏసీపీ రామ్చందర్రావు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లామన్నారు. ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారని వెల్లడించారు. మహిళను హత్య చేసి తగలబెట్టారా? లేదా సజీవ దహనం చేశారా? అనేది పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుందని వివరించారు. మహిళ ఎవరనే వివరాలు సేకరించే పనిలో ఉన్నామన చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశామని ఏసీపీ తెలిపారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసు పరిశీలించారు. తొండుపల్లిలోని బంకులో ఓ యువకుడు బాటిల్ తో పెట్రోల్ కొనుగోలు చేశాడని గుర్తించారు. మహిళను తగులబెట్టిన నిందితుడికి మరో వ్యక్తి సాయం చేశాడని అనుమానిస్తున్నారు. హత్యకు గురైన ఆమె వేరే రాష్ట్రానికి చెందిన మహిళగా భావిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో 2019 నవంబర్ 27న జరిగిన దిశ హత్య కేసు పెను సంచలనం సృష్టించింది. ఆమెపై లైంగికదాడి చేసిన తర్వాత నిందితులు హత్య చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 6న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. హైదరాబాద్ పరిధిలో అనేక హత్యలు జరిగాయి.
తాజాగా జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఓ యువతిని ఉన్మాది వివస్త్రను చేశాడు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో ఇలా వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.