హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కోకాపేట్లో ఎకరం వంద కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. దాని ప్రభావం ఇతర ప్రాంతాలపైనా పడింది. బుద్వేల్లోని భూముల ఈ-వేలానికి భారీ స్పందన వచ్చింది. కాసుల వర్షం కురిసింది. హెచ్ఎండీఏ అంచనా కంటే 2 రెట్లు ఆదాయం అధికంగా సమకూరింది.
రాజేంద్రనగర్ సమపంలోని బుద్వేల్ గుట్టపై ఉన్న 100 ఎకరాలను గురువారం హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ భూమిని 14 ప్లాట్లగా విభజించింది. తొలి సెషన్లో ఏడు ప్లాట్లు భారీ ధరకు అమ్ముడుపోయాయి. దీని ద్వారా రూ.2,057 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో సెషన్లో ఏడు ప్లాట్లు అమ్ముడుపోగా.. రూ.1,568.06 కోట్ల ఆదాయం లభించింది. అత్యధికంగా ఎకరాకు రూ.41.75 కోట్ల ధర పలికింది. దీని ద్వారా 7.16 ఎకరాలకు 298.93 రూ.కోట్ల ఆదాయం సమకూరింది. కనిష్ఠంగా రెండో నంబర్ ప్లాట్ ఎకరాకు రూ.33.25 కోట్లకు విక్రయించారు. ఇందులోని 8.15 ఎకరాలకు రూ.270.99 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం వంద ఎకరాలకు హెచ్ఎండీఏ రూ.2,000.20 కోట్ల ఆప్సెట్ ధర నిర్ణయించింది. కానీ అంచనాలను మించి రూ.3,625.73 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.
కోకాపేటలో కనీస ధర ఎకరాకు రూ.35 కోట్లుగా నిర్ణయించారు. బుద్వేల్లో ఎకరాకు కనీస ధర రూ.20 కోట్లుగా పెట్టారు. ఈ లేవుట్కు ఒకవైపు హిమాయత్సాగర్ వ్యూ కనిపిస్తోంది. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉంది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డుకు చాలా దగ్గరగా ఈ వెంచర్ ఉంది. ఇక్కడి నుంచి విమానాశ్రయం, ఐటీ కారిడార్లకు సులువుగా వెళ్లవచ్చు.హైదరాబాద్ నుంచి రావాలంటే పీవీ ఎక్స్ప్రెస్ వే నుంచి అత్తాపూర్ ర్యాంపు వద్ద కిందకు దిగాలి. అక్కడ నుంచి రాజేంద్రనగర్ ద్వారా ఈ లేఅవుట్ వద్దకు చేరుకోవచ్చు. ఈ లేఅవుట్ను ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోస్టేషన్కు అనుసంధానం చేస్తారు.
కోకాపేట లేఅవుట్లో బడా కంపెంనీలు భూముల కొనుగోలు కోసం పోటీ పడ్డాయి. అయితే కొన్ని సంస్థలే ప్లాట్లు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు బుద్వేల్ లోనూ భూములు కొనేందుకు ఎగబడ్డాయి. ఇక్కడ బహుళ నిర్మాణాల జోన్ కింద భూములను కేటాయించారు. ఏఏఐ అనుమతులకు లోబడి ఈ వెంచర్లోనూ అపరిమితమైన అంతస్తులు నిర్మించుకునే వీలు కల్పించారు.