Modi speech on no confidence motion(Parliament session live today): విపక్షాలు వరుస నోబాల్స్ వేస్తుంటే.. అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోందంటూ ప్రధాని మోదీ INDIA టీమ్కు కౌంటర్లు వేశారు. 2024లోనూ అన్ని రికార్డులు బద్దలుకొట్టి మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. పేదల గురించి ఆలోచన లేకుండా.. అధికారంలోకి రావడమే ప్రతిపక్షాల పరమావధి అని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని.. ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదని సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. INDIA ను I.N.D.I.A గా ముక్కలు చేశారని మండిపడ్డారు.
2018లోనూ అవిశ్వాసం పెట్టారని.. అప్పుడు నో కాన్ఫిడెన్స్.. నో బాల్గానే మిగిలిపోయిందన్నారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని ఎద్దేవా చేశారు. విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమేనని మోదీ అన్నారు.
కాంగ్రెస్కు నిజాయితీ లేదు.. విజన్ లేదని మోదీ తప్పుబట్టారు. భారత్ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని మండిపడ్డారు. దేశ ప్రజల్ని ఇండియా కూటమి తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
తాము స్కామ్లు లేని ప్రభుత్వాన్ని దేశానికి ఇచ్చామని.. దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశామని.. దేశం ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనమని మోదీ చెప్పారు. 2014 తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.
LIC ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారని.. ఈరోజు LIC ఎంతో పట్టిష్టంగా ఉందని గుర్తు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని అబద్ధాలు ప్రచారం చేశారని.. HALపైనా ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు.