MP Vijayasai Reddy : సినీ రంగంపై వైసీపీ నేతల విమర్శల మంటలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ చిరంజీవిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. సినీ రంగం ఆకాశం నుంచి ఊడి పడలేదని విజయసాయి అన్నారు. ఫిలిం స్టార్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పారు. పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని.. వారి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని చెప్పారు. వారి యోగ క్షేమాలను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం అంతాఇంతా కాదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమారంగంపై పడతారేందుకు అని చిరంజీవి తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడం వంటి వాటి గురించి మాట్లాడితే తలవంచి నమస్కరిస్తామని అన్నారు. చిరు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే మొదట ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో సినిమా హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకే చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని, ఎంతో మంది కార్మికుల శ్రమ అని ఇటీవల రాజ్యసభలో విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. సినిమా బడ్జెట్లో ఎక్కువ పారితోషికం హీరోలకు వెళ్లే పద్ధతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్ మొత్తంలో ఎక్కువ డబ్బులు ప్రస్తుతం హీరోల రెమ్యునరేషనే ఉంటోందని గుర్తుచేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. సినిమా చిత్రీకరణలో భాగంగా పని చేసిన కార్మికులకు మాత్రం తక్కువ జీతాలు, భత్యాలు ఇస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. అందరూ సమానంగా కష్టపడతారని, కాబట్టి, అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని కోరారు.
ఇలా విజయసాయికి చిరు కౌంటర్ ఇవ్వడం.. చిరంజీవిపై వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శల దాడి జరగడం.. మెగా ఫ్యాన్స్ రియాక్షన్స్తో ఏపీ రాజకీయం హాట్ హాట్గా సాగుతోంది.