నిరుద్యోగులు కదం తొక్కారు. కదం కదం కలిసి.. కమిషన్ కార్యాలయంపై దండెత్తారు. గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ టీఎస్పీఎస్సీని ముట్టడించారు. పోలీసులు భారీగా మోహరించి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఒకరు ఇద్దరు అయితే ఎలాగోలా ఆపేసే వారే. లేపేసి లోపలేసే వాళ్లే. కానీ, చీమలదండులా, ఉప్పెనలా విరుచుకుపడ్డారు నిరుద్యోగులు. వందలు, వేలల్లో విద్యార్థులు ఆందోళనకు తరలివచ్చారు. ఓయూ జేఏసీ, NSUI సంఘాలకు తోడుగా కాంగ్రెస్ శ్రేణులు సైతం వారికి మద్దతుగా నిలవడంతో.. టీఎస్పీఎస్సీ భవనం దద్దరిల్లిపోయింది. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
TSPSC కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ముట్టడికి వచ్చిన అభ్యర్థులను అరెస్టులు చేస్తున్నారు. గ్రూప్-2 వాయిదా వేయాలంటూ గంటల తరబడి ప్లకార్డులు పట్టుకుని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. నిరుద్యోగుల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎంతగా అడ్డుకుంటున్నా.. నిరుద్యోగులు కదిలేదేలే అంటున్నారు.
ఈ నెల 29, 30వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరుగనున్నాయి. అయితే 23 వరకు గురుకులం పరీక్షలు, సెప్టెంబర్ 12 నుంచి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయం లేదని.. పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు మద్దతుగా టీజేఎస్ కోదండరాం తరలివచ్చి ధర్నాలో కూర్చున్నారు. ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్, అద్దంకి దయాకర్, రియాజ్ తదితరులు విద్యార్థులకు సంఘీభావంగా కదలివచ్చారు.