జనసేనాని మూడో విడత వారాహి యాత్రకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదంటూ గట్టిగానే ఆంక్షలు విధించారు. మొత్తం 22 షరతులతో యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
యాత్ర తొలిరోజు సభను జగదాంబ నుంచి ప్రారంభించాలని ముందుగా ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. జనసేన నేతలతో కలిసి పోలీసులు సభాప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులిచ్చారు. తీరా బుధవారం రాత్రి సభా స్థలిని మరోచోటకు మార్చాలని సూచించారు. బీచ్ రోడ్డు లేదా జైలు రోడ్డులో నిర్వహించుకోవాలని సీపీ త్రివిక్రమవర్మ తెలిపినట్లు జనసేన నాయకులు చెప్పారు. మొదట సరే అని సడన్గా మరోచోటకు మార్చుకోమంటే కష్టమని నాయకులు తేల్చి చెప్పారు. బుధవారం రాత్రి సభ విషయంపై పోలీస్ కమిషనర్ డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ అధికారులతో చర్చించి ఎట్టకేలకు షరతులతో జగదాంబ వద్ద సభకు అనుమతిచ్చారు.
సభకు 22 షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. ఎయిర్పోర్టు నుంచి ఓపెన్ టాప్లో రాకూడదని మౌఖికంగా ఆదేశాలిచ్చారు. హైవేపై వారాహి యాత్ర చేయకూడదని షరతు విధించారు. రోడ్లపై ఎక్కడైనా ప్రజలు ఎక్కువమంది ఉంటే అక్కడ వాహనం నుంచి దిగకూడదని, నిలబడకూడదని షరతు పెట్టారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, ఇతర పార్టీలపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయకూడదని.. ప్రజలకు భయాందోళనలు కలిగించేలా ప్రకటనలు ఉండకూడదని సూచించారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకూడదని, విగ్రహాలు, ఆస్తులను ధ్వంసం చేయకూడదని పేర్కొన్నారు. తొక్కిసలాట దృష్ట్యా తక్కువమందినే అనుమతిస్తామన్నారు. షరతుల్లో ఏదైనా ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండా అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అయితే, ఈ ఆంక్షలేవీ లెక్క చేయకుండా.. గురువారం ఉదయం విశాఖకు వచ్చిన పవన్ కల్యాణ్కు జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు.. భారీ కాన్వాయ్తో జనసేన సత్తా చాటారు. పవన్ ప్రభంజనాన్ని పోలీస్ రూల్స్ అడ్డుకోలేవని చాటిచెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో వారాహి యాత్రను పూర్తిచేసిన ఆయన గురువారం నుంచి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు.
విశాఖలోని జగదాంబ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈనెల 14 వరకూ పవన్ విశాఖలోనే ఉంటారు. అదేరోజు రాత్రికి విజయవాడకు చేరుకుని, 15న స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొంటారు. 16న మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి 17 నుంచి యాత్ర కొనసాగిస్తారు.