భోళా శంకర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ రేట్లను పెంచడానికి అనుమతివ్వాలంటూ ఆ సినిమా నిర్మాతలు పెట్టుకున్న అభ్యర్థనపై ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. గతంలో సినీ ప్రముఖులతో భేటీ అయిన సీఎం జగన్.. ఏపీలో 20 శాతం సినిమా షూటింగ్ చేస్తే ఏం కావాలన్నా చేస్తామని మాటిచ్చారు. అయితే భోళాశంకర్ మూవీని ఏపీలో ఎన్ని రోజులు చిత్రీకరించారు..? ఎంత శాతం చిత్రీకరణ ఏపీలో జరిగిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సినిమా బడ్జెట్ పై కూడా క్లారిటీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటిందని ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చారు మూవీ మేకర్లు. అయితే 11 డాక్యుమెంట్లు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. సినిమా నిర్మాత గత ఏడాదికి చెందిన ఐటీ రిటర్న్స్ ప్రూఫ్స్ ఇవ్వలేదని, జీఎస్టీ ఆధారాలు ఇవ్వలేదని అంటోంది.
మరోవైపు ప్రభుత్వ అభ్యర్థనలపై భోళా శంకర్ సినీ నిర్మాత ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రభుత్వం అడిగిన వివరాలను చిత్ర యూనిట్ అందిస్తుందా..లేదా…అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. దీంతో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సస్పెన్స్ నెలకొంది.