అసెంబ్లీ సెషన్ చివర్లో సీఎం కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే లేనంతగా అధిక శాలరీలు ఇస్తున్నామని.. భవిష్యత్తులోనూ ఇస్తామని చెప్పారు. త్వరలోనే మంచి ఐఆర్ ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జీతాల పెంపు కోసం పీఆర్సీని కూడా వేస్తామని వెల్లడించారు. ఉద్యోగులు అడగకుండానే.. ధర్నాలు, ఉద్యమాలు గట్రా చేయకుండానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మరీ ఐఆర్ ఇస్తాం, జీతాలు పెంచుతామని.. ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తితో పాటు అనుమానమూ రేకెత్తుతోంది.
ఒకటో తేదీన జీతమే వేయట్లేదు.. అలాంటిది శాలరీ పెంచుతానని చెప్పడమేంటనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందనే వార్తలు వస్తున్నాయి. పైసల్ లేక భూములు అమ్ముకునే దుస్థితి దాపురించింది. ఇటీవలే రైతు రుణమాఫీ కూడా ప్రకటించారు. రుణమాఫీకే 19వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు ఐఆర్ పెంచడం అదనపు భారం. పీఆర్సీ వేసి జీతాలు కూడా పెంచితే అది మోయలేని బరువే. అయినా, అది చేస్తాం ఇది చేస్తాం అని కేసీఆర్ సభలో ప్రకటించడం విశేషం.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇలానే చేశారని గుర్తు చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. 2018లో పీఆర్సీ వేసి మరీ.. జీతాలు పెంచకుండానే.. ఎన్నికలకు వెళ్లారు. మళ్లీ గెలిపిస్తే.. మంచిగా పెంచుతానంటూ ఉద్యోగ సంఘాలను బ్లాక్ మెయిల్ తరహాలో మేనేజ్ చేశారని అంటారు. ఈసారి కూడా సేమ్ టాక్టీస్ ప్లే చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేళ కాబట్టి ఐఆర్ ఎలానూ వేస్తారు. దాంతో పాటు పీఆర్సీ కూడా వేసేసి.. ఉద్యోగులకు ఆశపెట్టి.. ఈసారి కూడా తననే గెలిపించండి.. గతంలో మాదిరే దేశంలోనే లేనంత భారీగా శాలరీస్ పెంచుతానని.. ఎన్నికల పబ్బం గడిపేసుకుంటారని అనుమానిస్తున్నారు.
అయితే, గతంలో మాదిరి ఈసారి కేసీఆర్ సులువుగా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ అత్యంత బలంగా ఉంది. బీజేపీ బలపడుతోంది. బీఆర్ఎస్ గ్రాఫ్ దారుణంగా పతనమవుతోంది. కేసీఆర్ సర్కారుపై అన్నివర్గాల్లో వ్యతిరేకత ఉంది. అందరికంటే ఎక్కువగా ప్రభుత్వ టీచర్లు సీఎంపై రగిలిపోతున్నారు. కొత్త జిల్లాల్లో స్థానికత రగడ, ట్రాన్స్ఫర్స్, ఒకటో తారీఖున జీతం పడకపోవడాన్ని సహించలేకపోతున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించేది ఉపాధ్యాయులే కాబట్టి.. వారి ప్రకోపాన్ని కాస్తైనా తగ్గించేలా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆ ప్రకటన చేశారని చెబుతున్నారు. అసలే ప్రభుత్వ ఉద్యోగులు.. ముఖ్యమంత్రి బుట్టలో అంత ఈజీగా పడిపోతారా? జీతం పెరుగుతుందని జీహుజూర్ అంటారా? చూడాలి ఏం జరుగుతుందో.