Terrorists: ముంబై ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. అప్పటినుంచి టెర్రరిస్ట్ అంటేనే జనాలు హడలిపోతున్నారు. స్పెషల్ ఫోర్సెస్ను మరింత పటిష్టం చేసి నిత్యం అలర్ట్గా ఉంచుతున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని ఓ ఆలయంలో అనూహ్య ఘటన జరిగింది. కాసేపు తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే…
మహారాష్ట్ర ధూలేలోని శ్రీ స్వామి నారాయణ ఆలయం. భక్తులతో కోలాహలంగా ఉంది. అంతలోనే ముఖానికి ముసుగు ధరించిన కొందరు తుపాకులతో ఆలయంలోకి దూసుకొచ్చారు. ఓ భక్తుడి తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించారు.
ఊహించని పరిణామానికి ఆలయంలోని భక్తులు షాక్కు గురయ్యారు. పిల్లలు బోరున ఏడ్వడం మొదలుపెట్టారు. తన చిన్నారి బెదిరిపోయి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఓ తండ్రికి తెగ కోపం వచ్చేసింది. ఇదేం పనంటూ.. తుపాకీతో ఉన్న దుండగుడిపైకి దూసుకెళ్లాడు. ఆవేశంతో చెంప పగలగొట్టాడు. అసలే ఉగ్రవాది.. ఆయన్నే కొడితే ఊరుకుంటాడా?
ఈలోగా టెంపుల్లో టెర్రరిస్టులు జొరపడ్డారని పోలీస్ కంట్రోల్ రూమ్కు మెసేజ్ వచ్చింది. పోలీసులు వెంటనే హైఅలర్ట్ అయ్యారు. ఆ ఆలయంలోకి ప్రవేశించి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ముసుగు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. గన్ పట్టుకున్న ఉగ్రవాదిని చూసి అదరకుండా బెదరకుండా దాడి చేసిన భక్తుడిని అంతా ప్రశంసిస్తున్నారు.
కట్ చేస్తే.. ఇదంతా మాక్ డ్రిల్ అని చివరాఖరికి చల్లగా ప్రకటించారు పోలీసులు. ముఖానికి ముసుగు వేసుకొచ్చింది ఉగ్రవాదులు కాదని.. పోలీసులేనని చెప్పారు. ఆ భక్తుడి ధైర్యాన్ని ప్రశంసించారు. మాక్ డ్రిల్ ఏమో కానీ.. భయంతో చచ్చినంత పని అయిందంటూ స్థానికులు ఖాకీలపై మండిపడుతున్నారు.