Nagababu latest news(Andhra Pradesh political news today): చిరుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసేన మూకుమ్మడి దాడికి దిగింది. ఓ వైపు పవన్, మెగా ఫ్యాన్స్, మరో వైపు కాపు నేతలు అటాక్ చేస్తుంటే.. ట్విట్టర్ వేదికగా జనసేన నాయకుడు నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. పనిలేని వాళ్లు పిల్లి తల గోకినట్లు.. నిజం మాట్లాడిన వ్యక్తిపై వైసీపీ మంత్రులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
చిరుతో ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఇవాళ ఆయనపై కారుకూతలు కూస్తున్నారని.. ఆకాశంపై ఉమ్మేస్తే వాళ్ల ముఖంపైనే పడుతుందన్నారు నాగబాబు. శాఖలపై అవగాహనలేని మంత్రులున్నారని.. అభివృద్ధి అంటే అర్ధం కూడా తెలియనివాళ్లు కూడా విమర్శలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు.
బటన్ నొక్కి.. కోట్లల్లో ముంచి.. వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు నాగబాబు. రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా? అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ నేతల ఆలోచనలు ఎంత క్షీణించిపోయాయో అజ్ఞానంతో కూడిన వాళ్ల మాటలు వింటే అర్థమవుతుందన్నారు నాగబాబు. వైసీపీ దౌర్భాగ్యపు, దుర్మార్గపు పాలనకు ఎండ్ కార్డు దగ్గర్లోనే ఉందన్నారు. కాలం గాలమేస్తే ప్రకృతే శతృవవుతుందని.. ఆరోగ్యాలు జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.