Survey report on ministers in telangana(Political news in telangana): తెలంగాణ ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. ఈ తరుణంలో అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామన్న కేసీఆర్.. తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులపై సర్వే చేయించిన ఆయన… ఆ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐతే ఇది మంత్రులకు శరాఘాతంగా మారే అవకాశం కనిపిస్తోంది.
నియోజకవర్గాల్లో వ్యతిరేకత నేపథ్యంలో ఆయా మంత్రుల స్థానాలను మార్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ సహా 12 మంది కేబినెట్ మంత్రులకు స్థాన చలనం కలగనుందని సమాచారం. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంకా ఆ జాబితాలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లు సమాచారం. అంతే కాదు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవిలో కొనసాగుతున్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ ను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తోంది. ఈ కారణంగా గులాబీ పార్టీ వీక్ ఉన్న చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి.. వారి స్థానాల్లో మంత్రులను బరిలోకి దించాలని కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం. అలాగే వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది.