కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై రెండోరోజు చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చర్చను ప్రారంభించారు. తన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత తొలిసారి ప్రసంగించారు. సభలో ప్రస్తుతం అదానీ అంశంపై మాట్లాడనని.. బీజేపీ ఎంపీలు భయపడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నావంటూ చాలా మంది తనను ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజలను కలిసేందుకు పాదయాత్ర చేశానని వివరించారు.
జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశానని రాహుల్ తెలిపారు. లక్షల మందితో తనతో కలిసి రావడంతో ధైర్యమొచ్చిందని పేర్కొన్నారు. తన యాత్ర ఇంకా ముగియలేదని లద్ధాఖ్ వరకు వెళ్తానని ప్రకటించారు. పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నానని వివరించారు.
భారతమాతను మణిపూర్లో హత్య చేశారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇదివరకే మణిపూర్ వెళ్లానని.. కానీ ప్రధాని మోడీ మాత్రం ఇప్పటి వరకు మణిపూర్ వెళ్లలేదన్నారు రాహుల్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారిని దేశ ద్రోహులుగా అభివర్ణించారు.
మోదీని రావణుడితో రాహుల్ పోల్చడంతో లోక్ సభ మరింత హీటెక్కింది. మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే రావణుడు విన్నాడని అలాగే ప్రధాని మోదీ కూడా అమిత్ షా, అదానీ మాటలే వింటారని రాహుల్ సెటైర్లు వేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సమయంలో అధికార , విపక్ష సభ్యుల పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు పక్షాల వాదనలతో లోక్ సభ దద్ధరిల్లింది. స్పీకర్ జోక్యం చేసుకున్నా మాటల యుద్ధం ఆగలేదు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ భారతీయుడు కాదని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను జాతి క్షమించదన్నారు. భారతమాత హత్య అంటారా అని మండిపడ్డారు. విపక్ష కూటమి ఇండియా కాదని.. అవినీతి కూటమిని ఆరోపించారు. న్యాయం గురించి కాంగ్రెస్ మాట్లాడటమా అని ప్రశ్నించారు.
UPA హయాంలో మహిళలపై జరిగిన అత్యాచారాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించారు. రాజస్థాన్లో బాలికపై సామూహిక అత్యాచారం చేసి ముక్కలుగా నరికారని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయాలు రాహుల్ గాంధీ కనిపించవా..? అని నిలదీశారు. 1990లో కశ్మీరి పండిట్ అయిన గిరిజా టికూను అత్యాచారం చేసి హత్య చేసిన దారుణాన్ని సభలో ప్రస్తావించారు స్మృతి ఇరానీ..