జైలర్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్లో సూపర్స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్లలా పేలిన ఈ డైలాగ్స్ ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. తనపై విమర్శలు చేసిన వాళ్లకు రజినీ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేయడంపై మండిపడ్డారు. సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.
ఎన్ని విమర్శలు చేసినా తాను మౌనంగానే సమాధానం ఇచ్చానని తమిళ సూపర్ స్టార్ తెలిపారు. ప్రతీ ఒక్కడూ విమర్శిస్తే సమాధానం చెబుతూ ఉండలేనని అన్నారు. ఈ లోకంలో మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండూ జరగని ఊరే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ మనం మాత్రం మన దారిలో వెళ్లిపోతూనే ఉండాలన్నారు. తమిళంలో మాట్లాడిన సూపర్ స్టార్ చివర్లో… అర్థమయ్యిందా రాజా? అంటూ తెలుగులో చెప్పి ట్విస్ట్ ఇచ్చారు.
రజినీకాంత్ టార్గెట్ చేసింది ఎవరిని? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తమిళ సూపర్ స్టార్ వైసీపీ నేతలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు కామెంట్లు చేశారు. అందుకే చివరిలో తెలుగులో అర్థమయ్యిందా రాజా అన్నారని అంటున్నారు.
కొంతకాలంగా క్రితం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చారని పొగిడారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఆ విజన్ -2047 అమలైతే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఆ సమయంలో రజినీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. కొడాలి నాని, రోజా , జోగి రమేష్ ఇలా చాలా మంది నేతలు ఘాటుగా విమర్శించారు. శతజయంతి వేడుకల్లో ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా చంద్రబాబును పొగడటమేంటని ప్రశ్నించారు. కానీ వైసీపీ నేతల విమర్శలపై రజినీకాంత్ ఎక్కడా స్పందించలేదు. తాజాగా జైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైసీపీ నేతల టార్గెట్ గానే పంచ్ డైలాగ్స్ వదిలారని నెటిజన్లు అంటున్నారు. మరి రజినీ డైలాగ్స్ పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.