కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో రెండో రోజు జరగనుంది. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మంగళవారం కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.నిజానికి రాహుల్ గాంధీయే చర్చను ప్రారంభించాల్సి ఉంది. కానీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ ముందుగా మాట్లాడితే అధికారం పక్షం రాహుల్ విమర్శలు చేసి టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. అందుకే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ అగ్ర నేతల ప్రసంగాల తర్వాతే తాను మాట్లాడాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం లోక్ సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పై మాట్లాడే అవకాశం ఉంది. రాహుల్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని స్పీకర్కు తెలియజేసినప్పుడు ఆయన ఎందుకు చర్చను ప్రారంభించలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. బుధ, గురువారాల్లో అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. గురువారం ప్రధాని మోదీ తీర్మానంపై మాట్లాడతారు.
మంగళవారం అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన విపక్షాల సభ్యులు అధికార పక్షాన్ని కార్నర్ చేశారు. మణిపూర్ ఇష్యూపై కేంద్రాన్ని నిలదీశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే.. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టింది. గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా అనుమతించారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోదీ మాట్లాడాలని కోరుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.