కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. దీనిపై మూడు రోజులపాటు చర్చ జరుగుతుంది. చివరిరోజు ప్రధాని మోదీ మాట్లాడతారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య వైరం నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. హింసాకాండ జరుగుతోంది. రెండువర్గాలు దాడులు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు మణిపూర్ అంశంపై ఉభయ సభల్లో రగడ జరిగింది. మణిపూర్ పై మోదీ మాట్లాడాలని చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని పార్లమెంట్కు రావాలని కోరుతున్నాయి.
మణిపూర్ ఇష్యూపై మోదీ మాట్లాడకపోవడంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ పై హోంమంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వం చెప్పింది. అయినా సరే ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధానే మాట్లాడాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రంపై అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించాయి.
తొలుత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ చర్చను ప్రారంభించారు. దీంతో సభలో కాసేపు అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ ఎందుకు చర్చ ప్రారంభించలేదని అధికార పక్షం సభ్యులు నిలదీశారు.
తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చేలా పరిస్థితులు తలెత్తాయని గౌరవ్ గొగొయ్ అన్నారు. లోక్సభలో సంఖ్యా బలం గురించి తెలుసుకోవడానికి తెచ్చిన తీర్మానం కాదని స్పష్టం చేశారు. మణిపుర్కు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు.
అవిశ్వాస తీర్మానంపై మొత్తం 16 గంటలపాటు చర్చ జరుగుతుంది. బీజేపీకి 6. 41 గంటలు, కాంగ్రెస్కు గంటా 9 నిమిషాలు కేటాయించారు. డీఎంకే, టీఎంసీకి 30 నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు.వైసీపీ సభ్యులు 29 నిమిషాలు, శివసేన ఎంపీలు 24 నిమిషాలు మాట్లాడతారు. బీఆర్ఎస్, బీఎస్పీకి 12 నిమిషాల చొప్పున కేటాయించారు.