మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తనకు ఇక పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడో తేల్చి చెప్పేశారు. తన ప్రపంచమంతా సినిమానే స్పష్టం చేసేశారు. ఖైదీ నంబర్ 150, ఆచార్య, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ ఇలా వరుస సినిమాల్లో నటించి మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. త్వరలో భోళా శంకర్ గా రాబోతున్నారు. అయితే తాజాగా రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడంపై చర్చ జరుగుతోంది.
బాబీ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా 200 రోజుల వేడుకను చిత్రబృంద నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కొంతకాలంగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న అంశాలపై చిరంజీవి స్పందించారు. ప్రత్యేక హోదా, రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని రాజకీయ నేతలకు సూచించారు. పేదల కడుపునింపే దిశగా ఆలోచించాలన్నారు. అలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని చెప్పుకొచ్చారు. కానీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారేంటని చురకలు అంటించారు.
ఇటీవల బ్రో సినిమాపై వివాదం రేగింది. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్ర మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించే పెట్టారనే విమర్శలు వచ్చాయి. స్వయంగా అంబటి విమర్శలకు దిగారు. పవన్ కల్యాణ్ ను తప్పుపట్టారు. తనను ఉద్దేశించే శ్యాంబాబు పాత్రపెట్టి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. అటు శ్యాంబాబు పాత్ర పోషించిన పృథ్వీ అంబటికి కౌంటర్లు ఇచ్చారు. దీంతో బ్రో వివాదం ఏపీలో రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన పరోక్షంగా వైసీపీ నేతలకు కూడా చురకలంటించారు. చిరంజీవి టార్గెట్ చేసింది సీఎం జగన్ నా? అంబటి రాంబాబునా? ? అన్న చర్చ మొదలైంది.
వైసీపీ సర్కార్పై జనసేన అధినేతగా పవన్ విమర్శలు కురిపిస్తున్నా.. చిరంజీవి- వైఎస్ జగన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. సినిమా టికెట్ల వివాదం సమయంలో కూడా మెగాస్టార్.. జగన్తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ బ్రో సినిమా వివాదంపై ఇప్పుడు మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. చిరంజీవి వైసీపీకి దూరంగా జరుగుతూ.. తమ్ముడి పార్టీ జనసేనకు దగ్గరవుతున్నారా? అన్న చర్చ మొదలైంది.