Delhi Ordinance Bill :ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. రాజ్యసభలో చద్దా అనుసరించిన తీరుపై ఇప్పుడు అధికార పక్ష నేతలు ఛైర్మన్కు ఫిర్యాదు ఇచ్చారు. విపక్ష కూటమి సభ్యులు కూడా చద్దా అనుసరించిన తీరును తప్పు పడుతున్నారు. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది.
సోమవారం రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ రాఘవ్ చద్దా నోటీసులు ఇచ్చారు. ఇందులో కొందరు ఎంపీల సంతకాలు కూడా చేశారు. అయితే ఐదుగురు ఎంపీలు మాత్రం తమతో ఏ మాత్రం సంప్రదించకుండా తమ పేర్లను వాడారంటూ సభలో నిలదీయడంతో వివాదం మొదలైంది.
అనుమతి లేకుండానే తమ పేర్లను ఉపయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ కొందరు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్కు ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కూడా రెడీ అవుతోంది. చద్దా తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తప్పు పట్టారు. అయితే తనకు నోటీసులు ఇచ్చాక సమాధానం ఇస్తానని రాఘవ చద్దా అంటున్నారు.