పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం జగన్, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే.. పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందని సీఎం జగన్ విమర్శించారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు జగన్. అయితే వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లనే.. పోలవరం పూర్తి కావడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ వచ్చాక..ఒక్క సాగు నీటి ప్రాజెక్టు కూడా నిర్మాణం కాలేదని విమర్శించారు.
తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పనులు పూర్తి చేశామని… జగన్ ఈ నాలుగేళ్లలో నాలుగు శాతంతో సరిపెట్టారని మండిపడ్డారు చంద్రబాబు. రివర్స్ టెండర్లను, కాంటూరును 41.15 మీటర్లకు కుదించడాన్ని తప్పుపట్టారు. జగన్ సర్కారు చేసిన తప్పుల వల్ల… ఎంత ఎత్తులో ఉన్నా వరదల్లో ముంపు తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. భవిష్యత్తులో ఏడు ముంపు మండలాలను కలిపి పోలవరం జిల్లాగా చేసి బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు.
ఇక పోలవరం కట్టేది తాను కాదు.. కేంద్రమన్నారు సీఎం జగన్. వారిని ఒప్పించి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. తానైతే ముందుగా పునరావాసం పూర్తిచేశాకే ప్రాజెక్టు కట్టేవాడినని.. పునరావాసం అమలు కేంద్ర సహాయంతో ముడిపడి ఉందన్నారు జగన్. ఇక గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం స్పిల్వే కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారని తెలిపారు. మొదట స్పిల్వే పూర్తి చేసి నీళ్లు డైవర్ట్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. కానీ అలా జరగలేదన్నారు. నిపుణులు అధ్యయనం చేసిన తర్వాత కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గత సర్కారు నిర్వాకాల కారణంగా ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్లో ముందుకు వెళ్లలేకపోయిందన్నారు జగన్.