Gaddar: గద్దర్ అంత్యక్రియల ఏర్పాట్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేందనే ఆరోపణలు వచ్చాయి. ఎల్బీస్టేడియంలో గద్దర్ పార్ధివదేహాన్ని ఉంచిన సమయంలో వేలాది మంది ప్రజలు వచ్చారు. ప్రజాగాయకుడిని చివరిచూపు చూసేందుకు భారీ సంఖ్యలో జనం వస్తారని ప్రభుత్వ పెద్దలు తెలుసు. కానీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఎల్బీస్టేడియంలో గద్దర్ భౌతికకాయం ఉన్నంతసేపు గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. చాలామంది వీఐపీలు, సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు ప్రజాయుద్ధనౌక అభిమానులు అక్కడ తరలివచ్చారు. క్యూలైన్లు సరిగా ఏర్పాటు చేయలేదు. సరైన బందోబస్తు పెట్టలేదు. అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలే ఏర్పాట్లను పర్యవేక్షించారు తప్ప బీఆర్ఎస్ నేతలెవరూ ఆ బాధ్యత తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
గద్దర్ అంతిమయాత్ర సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. గద్దర్ ఇంటి వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వచ్చాయి. అందుకే అక్కడ తోపులాట జరిగింది. దీంతో సియాసిత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ పడిపోయారని అంటున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు జరిగిన గద్దర్ అంతిమ యాత్రలో జహీరుద్దీన్ పాల్గొన్నారు. గద్దర్ పార్థివ దేహాన్ని తరలిస్తున్న వాహనంలోనే ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత మహాబోది స్కూల్ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారు. భారీ వచ్చిన జనాన్ని పోలీసులు నియంత్రించలేదు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దీంతో జహీరుద్దీన్ పడిపోయారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఛాతీ నొప్పిరావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. జహీరుద్దీన్ గుండె పోటుతో మృతి చెందారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆయన బలైపోయారని ప్రజలు అంటున్నారు. కేసీఆర్ బాధ్యత వహిస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ప్రజాగాయకుడు గద్దర్ కు సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ అత్యంత సన్నిహితులు. దశాబ్దాలుగా వారి మధ్య స్నేహం ఉంది. గద్దర్ మరణవార్త తెలియగానే ఆయన అపోలో ఆస్పత్రికి వచ్చారు. ఎల్బీస్టేడియంలో గద్దర్ పార్థీవదేహాన్ని ఉంచినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అయితే ఆయన హఠాత్తుగా చనిపోవడం విషాదకరం. గద్దర్ అంత్యక్రియలు పూర్తకాకముందే ఆయన సన్నిహితుడు కన్నుమూయడం పెనువిషాదంగా మారింది.
గద్దర్ తో సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అభిప్రాయభేదాలున్నాయి. ఈ క్రమంలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభకు ప్రజాగాయకుడు హాజరయ్యారు. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని గతంలో గద్దర్ ప్రకటించారు. అసలు గద్దర్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం భావించలేదు. కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో అధికార లాంఛనాలతో నిర్వహించాల్సి వచ్చింది.
గద్దర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి కేసీఆర్ చేతులు దులుపుకున్నారు కానీ .. అంత్యక్రియల ఏర్పాట్లుపై మాత్రం శ్రద్ధపెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న మరణం సమయంలో కేసీఆర్ వైఖరిపై విమర్శలు వచ్చాయి. దళిత నేతలకు గులాబీ బాస్ ఎందుకు సరైన గౌరవం ఇవ్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.