ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు ముహూర్తం కుదిరించి. దసరా నుంచి జగన్ విశాఖలోనే నివాసం ఉండనున్నారు. రుషికొండలో ప్రస్తుతం ఆయన కోసం ఇప్పటికే భవనం రెడీ అవుతోంది. ఈ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే సివిల్ వర్క్స్ పూర్తి కాగా, ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పనులను తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా పరిశీలించారు.అలాగే రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల సైట్లో భద్రతను కూడా ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది పరిశీలించింది. ఆ ప్రాంతంలో APSP బెటాలియన్ ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణను తెరమీదకు తీసుకుని వచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత పలు కీలక పరిణామాలు జరిగాయి. మూడు రాజధానుల బిల్లు తీసుకురావడం.. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. మరోవైపు ప్రస్తుతం అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే పరిపాలన వికేంద్రీకరణను తీసుకొచ్చిన సీఎం జగన్.. విశాఖ నుంచి పాలన సాగించాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు.
అయితే రాజధాని అంశంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ.. సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగించడానికి అవి ఆటంకం కాకపోవచ్చని తెలుస్తోంది. కోర్టు అంశానికి, పాలన విశాఖ నుంచి ప్రారంభించేందుకు సంబంధం లేదంటున్నారు వైసీపీ నేతలు. ఎగ్జిక్యూటివ్ హెడ్గా తనకు నచ్చిన చోటి నుంచి పాలన చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని చెబుతున్నారు. అందుకే అక్టోబర్ 24న దసరా పర్వదినం నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించనుండటం దాదాపుగా ఖరారైంది.