Delhi Services Bill : కేంద్రానికి, ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదాన్ని రేపిన ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభ లో ఆమోదం పొందింది. ఈ బిల్లును సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సమయంలో కేంద్ర వైఖరిని కాంగ్రెస్, ఆప్ సహా విపక్షాలు తప్పుపట్టాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని మండిపడ్డాయి. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. విపక్షాల అభ్యంతరాలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు.
తీర్మానంపై ఓటింగు జరపాలని విపక్షాలు కోరాయి. దీంతో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. దీంతో ఢిల్లీ సర్వీసుల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బీఆర్ఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. వైసీపీ, బిజు జనతాదళ్ బిల్లుకు మద్దతు తెలిపాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నడవలేని స్థితిలో ఉన్నా రాజ్యసభకు వచ్చారు. చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. అనారోగ్యంతో ఉన్న జేఎంఎం ఎంపీ శిబు సోరెన్ కూడా ఓటేశారు.
ప్రజల హక్కులను పరిరక్షించడానికే ఢిల్లీ సర్వీసుల బిల్లు తీసుకొచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు.అవినీతిరహితమైన పాలనను అందించాలన్నదే లక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి ఉన్న ఢిల్లీ పాలన నిబంధనల్లో ఒక్కటీ కూడా మార్చలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉండే ఏ నిబంధనను బిల్లులో చేర్చలేదని తెలిపారు.
ఇతర రాష్ట్రాలకంటే ఢిల్లీ భిన్నమని అమిత్ షా తెలిపారు. ఇక్కడ పార్లమెంట్, దౌత్య కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా, పరిమిత అధికారాలున్న శాసనసభతో కూడి ఉందని వివరణ ఇచ్చారు. ఢిల్లీ
ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఢిల్లీ అధికారాన్ని వశం చేసుకోవడానికి ఈ బిల్లు తీసుకురాలేదని అమిత్ షా తెలిపారు.కేంద్ర అధికారాల్లోకి రాష్ట్రం చొచ్చుకురాకుండా అడ్డుకోవడం బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు.