సోమవారం..పోలవారం. ఈ డైలాగ్ వినగానే చంద్రబాబు గుర్తుకొస్తారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో వారం వారం పోలవరంపై సమీక్ష నిర్వహించేవారు. అనేకసార్లు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి పనులను పరిశీలించేవారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పేవారు. కానీ, అలా జరగలేదు. పోలవరం కంప్లీట్ కాలేదు. 2019 ఎన్నికల్లో గెలవలేదు. చంద్రబాబు మళ్లీ సీఎం కాలేదు. జగన్ సర్కారు వచ్చాక.. పోలవరంపై మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు అసలేం పెద్దగా పనులేమీ చేయలేదని.. నాణ్యత కూడా లేదని.. వైసీపీ ఆరోపిస్తోంది. అంతా తానే చేశానని.. ఇప్పటి వరకు జగన్ చేసిందేమీ లేదనేది చంద్రబాబు విమర్శ. తాజాగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మొదటిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి అక్కడినుంచే సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశామన్నారు చంద్రబాబు. జగన్ సర్కారు ఎంత శాతం పనులు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలన వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మండిపడ్డారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లు ఉంచాలని జగన్ సర్కారు నిర్ణయంపైనా విమర్శలు చేశారు.
అంతకుముందు.. పట్టిసీమ దగ్గర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని.. 2004 నుంచి పాలకుల నిర్వాకం వల్ల రెండు సార్లు బలైందని ఆరోపించారు. 2004లో పోలవరం టెండర్లు.. మధుకాన్, శీనయ్య సంస్థలకు దక్కితే కక్ష సాధింపు చర్యలతో పనులు రద్దు చేశారని ఆరోపించారు. జగన్ వచ్చాక కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చేశారని మండిపడ్డారు చంద్రబాబు.