Gaddar: ప్రజా గాయకుడు తరలిపోయారు. వివక్షపై గొంతెత్తి.. అనుక్షణం ప్రజాక్షేత్రంలో తన పాటతో ప్రజలను విప్లవోద్యమం వైపు నడిపిన గద్దర్ దివికేగారు. తన పాటలతో కదిలిపోయిన వారంతా.. అంతిమయాత్రలో ఆ పార్థీవదేహంతో కలిసి నడిచారు. దశాబ్ధాల పాటు పాటల పల్లకి మోసిన ఆ ప్రజాగాయకుడి పాడెను మోసేందుకు పోటీ పడ్డారు. పాటకు పర్యాయపదంగా మారిన ఆయనకు.. ఆ పాటల మధ్యే తుది వీడ్కోలు పలికారు. అల్వాల్లోని మహాబోధి స్కూల్లో బౌద్ధ పద్ధతిలో అధికారిక లాంఛనాలతో గద్దర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
గద్దర్ ఎలుగెత్తిన ప్రతి అక్షరం ఓ ధిక్కార స్వరమే కావచ్చు.. కానీ ఆనాడు పాలించిన వారు.. ఈనాడు పాలిస్తున్న వారు.. తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. ఆ తెలంగాణ చైతన్య స్వర గాయకుడికి తుది వీడ్కోలు పలికారు. సీఎం కేసీఆర్ సైతం గద్దర్ ఇంటికొచ్చి మరీ.. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అంతకుముందు.. గద్దర్ గొంతు నుంచి జాలువారిన పాటల నుంచి అణువణువు ఉత్తేజితమైన అభిమానులు, ప్రజా కవులు, కళాకారులతో పాటు.. రాజకీయ నేతలు, సినీ, ప్రజా సంఘాల నేతల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. అంతకుముందు ప్రజా యుద్ధ నౌక గద్దర్ కడ చూపు కోసం ప్రముఖులు ఎల్బీ స్టేడియంకు క్యూ కట్టారు. పలువురు రాజకీయ, సినీ, ప్రజా సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గద్దర్ చివరి చూపుకోసం తరలివచ్చిన అభిమానులతో ఎల్బీస్టేడియం నిండిపోయింది.
గన్పార్కులోని అమరవీరుల స్థూపం కాసేపు గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పించారు కళాకారులు. అనంతరం గన్పార్క్ నుంచి ఆల్వాల్ భూదేవినగర్లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. వేలాదిమంది అభిమానులు గద్దర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
పాటలతో జనం గుండె చప్పుడుగా నిలిచి.. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన ప్రజాగాయకుడిని.. అంపశయ్యపైనా కూడా పాటనే శ్వాసించి తుది శ్వాస విడిచిన ఆ విప్లవ వీరుడిని అశ్రునయనాల మధ్య సాగనంపారు కుటుంబ సభ్యులు, అభిమానులు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం గద్దర్ అంత్యక్రియలు జరిపారు. ప్రజా యుద్ధనౌకకు చివరిసారి లాల్ సలామ్ చెప్పేందుకు అశేష ప్రజానీకం తరలిరావడంతో.. వారిని కట్టడి చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో తొక్కిసలాట జరిగింది.
“నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుష్యులుగా గుర్తించబడరో.. అంతకాలం ఈ తిరుగుబాటు పాడుతూనే ఉంటాను. నా జాతి.. నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది”..అంటూ చివరిమాటగా చెప్పి.. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన గద్దర్.. చిరకాలం తన పాటలతో ప్రశ్నించే గొంతుకై ఉంటారు.