కర్నాటకకు చెందిన నందిని నెయ్యిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయించింది. మరి, బయటి నుంచి నెయ్యి కొనుగోలు ఆపేస్తుందా? టీటీడీనే సొంతంగా నెయ్యి తయారు చేసుకుంటుందా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక, టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి నిర్వహించిన చివరి పాలక మండలి సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అన్యాక్రాంతం అవుతున్న టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. దేవస్థానానికి చెందిన 68 స్థలాలకు కంపె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రూ.1.25 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.
ఘాట్ రోడ్డులో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలపై టీటీడీ దృష్టి సారించింది. రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేసేందుకు రూ.24 కోట్లు కేటాయించింది. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో వారి సౌకర్యార్థం తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో రూ.2.6 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలు ఇవే…
–రూ.4 కోట్లతో అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తుల కోసం షెడ్లు ఏర్పాటు
–రూ.2.5 కోట్లతో పీఏసీలో మరమ్మతు పనులు.
–రూ.23.50 కోట్లతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
–రూ.3.10 కోట్లతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు
–రూ.9.85 కోట్లతో వకుళమాత ఆలయం దగ్గర అభివృద్ధి పనులు
–రూ.3 కోట్లతో శ్రీనివాసం దగ్గర సబ్ వే నిర్మాణం
–శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయింపు
–ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్లు
–రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు
–ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు