Rahul Gandhi : రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంట్ కు రానున్నారు. లోక్ సభలో తిరిగి అడుగు పెట్టనున్నారు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునురుద్ధరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో లోక్ సభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునురుద్ధరిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 4 నెలల తర్వాత తొలిసారి లోక్సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి నివాళి అర్పించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు రాహుల్ ను ఆహ్వానించారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీలను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. రాహుల్ పై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసి ఓం బిర్లా టేబుల్ ముందుంచారు. రాహుల్ లోక్సభ సభ్యత్వ పునరుద్ధరణకు అవసరమైన పత్రాలను లోక్సభ సెక్రటేరియట్ పరిశీలించింది. అనంతరం మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంతకం చేశారు. దీంతో రాహుల్ లోక్ సభలో అడుగు పెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్గాంధీ పాల్గొంటారా లేదా అనే దానిపై ఏర్పడిన సస్పెన్స్ కు స్పీకర్ నిర్ణయంతో తెరపడింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చి 3 రోజులు అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. లోక్సభ సభ్యత్వాన్ని తొలగించడంలో ఉన్న తొందర, పునరుద్ధరించడంలో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష వింధించింది. దీంతో లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై వేటు వేసింది. సూరత్ కోర్టు తీర్పుపై గుజరాత్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. హైకోర్టు కూడా సూరత్ కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు..సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. దీంతో లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణకు మార్గం ఏర్పడింది.
2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టు లో రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ తీర్పుపై స్టే విధిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.