Girl : గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతనపై నుంచి తల్లి, చెల్లి తన కళ్లముందే నదిలో పడిపోయారు. 13 ఏళ్ల ఆ బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించింది. తెగువతో పోరాడింది. ప్రాణాలు కాపాడుకుంది. చిన్నారి చాకచక్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుప్పాల సుహాసినికి భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో అతడి నుంచి విడిపోయారు. ఆమె కూలి పని చేసుకుంటూ కుమార్తె కీర్తనను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2 ఏళ్ల క్రితం సుహాసినికి ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్తో పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్త సహజీవనానికి దారి తీసింది. వారికి ఏడాది క్రిత జెర్సీ అనే పాప పట్టింది.
రాజమండ్రి దుస్తులు కొందామంటూ భార్యపిల్లలను సురేశ్ కారులో తీసుకెళ్లాడు. వివిధ ప్రాంతాల్లో తిప్పి ఆదివారం వేకువజామున 4 గంటలకు రావులపాలెం వచ్చారు. వారిని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లాడు. సెల్ఫీ తీసుకుందామని చెప్పాడు. రెయిలింగ్ వద్ద పిట్టగోడపై తల్లి,పిల్లలను నిలబెట్టాడు. ఒక్కసారిగా తల్లితోసహా పిల్లలను నదిలోకి తోశాడు. వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు.
సుహాసిని, జెర్సీ నదిలో పడిపోయారు. కీర్తన వంతెన కేబుల్ పైపు చేతికి అందడంతో గట్టిగా పట్టుకుంది. పైపును పట్టుకొని వేలాడుతూనే ఎవరైనా రక్షిస్తారని ఎదురు చూసింది. గట్టిగా కేకలు వేస్తూ కాపాడమని వేడుకుంది. ఆ సమయంలో జన సంచారం తక్కువ. వాహనాల మాత్రమే వంతెనపై నుంచి వెళతాయి. కానీ ఆమె ఆర్తనాదాలు కూడా ఎవరికీ వినిపించవు.
పైన చీకటి .. కింద గోదావరి ఉద్ధృతి.. గాలిలో ప్రాణాలు. ఆ సమయంలో కీర్తన ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. తన జేబులో ఫోన్ ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఒకచేత్తో పైపును గట్టిగా పట్టుకుని.. మరో చేత్తో ఫోన్ బయటకు తీసింది. జాగ్రత్తగా పట్టుకుని 100 నంబర్ కు కాల్ చేసింది. తన ప్రమాద సమాచారాన్ని పోలీసులకు అందించింది.
కీర్తన నుంచి కాల్ వచ్చిన వెంటనే రావులపాలెం ఎస్ఐ వెంకటరమణ స్పందించారు. సిబ్బందితో కలిసి ఘటనాస్థిలికి చేరుకున్నారు. ఆ బాలికను రక్షించారు. దాదాపు అరగంటపాటు చీకట్లో పైపుపై వేలాడుతూనే ఫోన్ చేయడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. కీర్తనను కాపాడిని పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు.