Manipur Updates : కొద్ది రోజులుగా మణిపూర్ మండుతోంది. జాతుల మధ్య ఏర్పడిన వైరం .. మూడు నెలలుగా రాష్ట్రాన్ని కాలుస్తూనే ఉంది. అల్లర్లు, కాల్పులు, ఘర్షణలు, హత్యలు ఎంతకూ తగ్గుముఖం పట్టడం లేదు. సుమారు రెండు వందల మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వేలాది మంది ఇంటిని వదిలేసి నిరాశ్రాయులయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం తీసుకురావడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అయితే ఈ ఘర్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీకి అక్కడి స్థానిక పార్టీ గుడ్ బై చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మణిపూర్ లో స్థానిక పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందులో కుకీ పీపుల్స్ అలయన్స్ ఒకటి. అయితే తాజాగా బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు కేపీఏ అధినేత తోంగమాంగ్ షౌకిప్ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ అనుసూయ ఊకేకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
వాస్తవానికి 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో ఎన్డీఏకు 54 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే తాజాగా కుకీ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పటికీ 52 మంది ఎమ్మెల్యేల బలం బీరేన్ ప్రభుత్వానికి ఉంది. కానీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇది కొంత ప్రభావాన్ని చూపించనుంది. దేశవ్యాప్తంగా మణిపూర్ అంశం వైరల్ కావడంతో ఇతర రాష్ట్రాల్లో ఇది ఓట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.