TSRTC Bill : ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే బిల్లును తెలంగాణ శాసన సభ ఆమోదించింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు అలాగే ఉంటాయని వివరించారు. కార్మికుల బకాయిలను చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రకటించారు. ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ఎంతో కృషి చేశామని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ సభలో తెలిపారు.
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ అనవసరంగా వివాదం కొనితెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారు. ప్రజారవాణా కోసమే ఆర్టీసీ ఏర్పాటైందని తెలిపారు. కానీ ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. తాను కూడా రవాణాశాఖ మంత్రిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ఆర్టీసీ రూ.14 కోట్ల నష్టాల్లో ఉండేదని.. ఆ నష్టాన్ని పూడ్చి రూ.14 కోట్ల ఆదాయం తెచ్చామన్నారు. డీజిల్ ధర పెరగటం ఆర్టీసీకి పెను భారంగా మారిందని పేర్కొన్నారు. రోజూ 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారని వెల్లడించారు. కేబినెట్లో 5 గంటలు చర్చించిన తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీని గాడిలో పెడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పరంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బస్ స్టేషన్లను ఆధునికీకరిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత వస్తుందని సంతోష పడుతున్నారని పేర్కొన్నారు.
గవర్నర్ పనిలేని పని పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగారని కేసీఆర్ అన్నారు. చివరికి జ్ఞానోదయమై ఆర్టీసీ బిల్లును అనుమతించినందుకు సంతోషమన్నారు. ఆర్టీసీ కార్మికుల తరఫున గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.