Congress Leaders :ప్రజాగాయకుడి గద్దర్ మృతిపై కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క అపోలో ఆస్పత్రికి వెళ్లి గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. గద్దర్ భార్య విమలను ఓదార్చారు. తెలంగాణ కోసం గళమెత్తిన గొప్ప వ్యక్తి గద్దర్ అని ఠాక్రే కొనియాడారు. అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు.పేదల పక్షాన నిలబడిన వ్యక్తి గద్దర్ అని గుర్తు చేశారు.
గద్దర్ మృతికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ లో సంతాపం తెలిపారు. ఆయన మృతి వార్త వినిగానే బాధ కలిగిందన్నారు. ప్రజలపై ప్రేమతోనే ఆయన పోరాటం వైపు నడిచారని తెలిపారు. గద్దర్ మార్గం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు గద్దర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గద్దరన్నా.. నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం
నీ గానం.. తెలంగాణ వేదం
నీ గజ్జె.. తెలంగాణ గర్జన
నీ గొంగడి.. తెలంగాణ నడవడి
నీ గొంతుక.. తెలంగాణ ధిక్కార స్వరం
నీ రూపం.. తెలంగాణ స్వరూపం
గద్దరన్న.. నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం
నీ మరణం.. నా గుండెకు శాశ్వత గాయం అంటూ రేవంత్ సంతాపం ప్రకటించారు.
ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. తన పోరాటానికి ఆయనే స్ఫూర్తిగా పేర్కొన్నారు. గద్దర్ మృతికి మల్లు రవి సంతాపం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గద్దర్ పోటీ చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలని అందుకోసం కృషి చేస్తానని ఆయన చెప్పినట్లు తెలిపారు.
గద్దర్ తన పాట ద్వారా అణగారిన వర్గాల వారిని చైతన్య పరిచారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక.. గద్దరన్న అని తెలిపారు. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని కోరారు.