Gaddar : గద్దర్ అంటేనే పాటకు పర్యాయ పదం. తన బతుకంతా సుదీర్ఘ పోరాటం. జీవితం తుది వరకు ప్రజల పక్షాన నిలబడిన పోరు కెరటం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసిన గద్దర్ ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. నక్సలిజం బాట పట్టారు. గదర్ పార్టీ స్ఫూర్తితో ఆయన పేరును గద్దర్గా మార్చుకున్నారు. సుధీర్ఘ కాలం నక్సలైట్ ఉద్యమంలో పని చేశారు. ఆ తర్వాత జన జీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. అందుకోసం బుర్రకథను ఎంచుకున్నారు. ఈ ప్రదర్శనను చూసిన సినిమా డైరెక్టర్ బి.నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం తన ప్రదర్శనలు ఇచ్చేవారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడారు. ఈ పాట గద్దర్ కు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.
1975లో కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరిన గద్దర్.. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు. ఒగ్గు కథ , బుర్రకథ, జానపదంతో జనంలోకి వెళ్లారు. తెలంగాణ మలి దశ పోరాటంలో భాగస్వామి అయ్యారు. 1990 ఫిబ్రవరి 18న జన నాట్యమండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు 2 లక్షల మంది హాజరయ్యారు. ఈ సభ విజయవంతం చేయడంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు.
గద్దర్ ను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రజా సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఒరేయ్ రిక్షా సినిమాలో” నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..” అనే పాటకు నంది అవార్డు వచ్చింది. కానీ ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
గద్దర్ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూనే రాజకీయాలపైనా ఆసక్తి చూపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. అలాగే సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతు పలికారు. “మా భూములు మాకే” నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఇటీవల ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభకు గద్దర్ హాజరయ్యారు. రాహుల్గాంధీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఇలా జీవితం మొత్తం బహుజనులు, పేదల పక్షానే పోరాటం చేసి ప్రజా యుద్ధనౌకగా నిలిచారు. ఆ ఉద్యమ గళం ఇక శాశ్వతంగా మూగబోయింది.