Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ఆ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతుల నీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే ఏపీలో సిరులు పండుతాయన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని చంద్రబాబు ఆరోపించారు.అందువల్లే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారని వెల్లడించారు. బిల్లులు పెండింగ్లో ఉండిపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు.
సోమశిల డ్యామ్కు ప్రమాదం పొంచిఉందని చంద్రబాబు హెచ్చరించారు. గండిపాలెం రిజర్వాయర్ ను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కాలువల్లో పూడిక తీయలేదన్నారు. పెండింగ్ బిల్లుల కారణంగా పెద్దిరెడ్డి సాగర్ రిజర్వాయర్, డీఎం ఛానల్, డీఆర్ ఛానల్, సోమశిల, కండలేరు వరదకాలువ పనులు నిలిచిపోయాయని చంద్రబాబు విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని తొలుత రాయలసీమలో చేపట్టారు. సీమలో ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ఎంతవరకు జరిగాయో వివరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు, ఖర్చు చేసిన నిధుల లెక్కలను వివరించారు.
రాయలసీమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చంద్రబాబు నెల్లూరులో అడుగుపెట్టారు. మరోవైపు చంద్రబాబు పర్యటనల్లో ఉద్రిక్తతలు తెలెత్తుతున్నాయి. పుంగనూరులో విధ్వంసకాండ జరిగింది. ఆ తర్వాత శ్రీహళహస్తిలో టెన్షన్ వాతావరణ ఏర్పడింది. ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళతానని టీడీపీ అధినేత స్పష్టం చేస్తున్నారు.