RTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లుపై ఉత్కంఠ వీడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి, అధికారులతో గవర్నర్ చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఆమోదించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. ఆదివారమే ఈ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లుపై చర్చ జరపాల్సి ఉన్న నేపథ్యంలో అసెంబ్లీని మరో రెండురోజులపాటు ప్రభుత్వం పొడిగించింది.
3 రోజులుగా ఆర్టీసీ బిల్లు గవర్నర్ వద్దే ఉంది. సభలో పెట్టేందుకు అనుమతి కోసం ప్రభుత్వం ఎదురుచూసింది. తొలుత గవర్నర్ బిల్లులోని 5 అంశాలపై వివరణ కోరారు. తమిళిసై లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ ద్వారా గవర్నర్ కు వివరణ పంపించారు.
ప్రభుత్వం పంపిన సమాధానంతో తమిళిసై సంతృప్తి చెందలేదు. మరో 6 అంశాలపై సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం వెంటనే వాటికి సమాధానాలు పంపింది. దీంతో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ అనుమతి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది. తొలుత నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగుస్తాయి. కానీ గవర్నర్ బిల్లుకు అనుమతి ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం యోచించింది. కానీ ఈ లోపే గవర్నర్ ఆర్టీసీ బిల్లుకు అనుమతి ఇచ్చారు.
అంతకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లు వ్యవహారంపై చర్చించారు. ఇక అడ్డంకులు తొలగిపోవడంతో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.