CAG Report : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన రిపోర్ట్ ను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఈ నివేదికను రూపొందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై రిపోర్ట్ ఇచ్చింది.
100 రోజులపాటు రూ. 22,669 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్కు ప్రభుత్వం వెళ్లిందని కాగ్ రిపోర్ట్ లో వెల్లడైంది. 2020-21లో రెవెన్యూ లోటు రూ. 9,335 కోట్లుగా ఉందని పేర్కొంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 44 శాతం తగ్గాయని తెలిపింది.
2021-22 వరకు రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లుగా ఉన్నాయని కాగ్ వెల్లడించింది. ఈ అప్పు జీఎస్డీపీలో 27.40 శాతమని వివరించింది.
ప్రభుత్వం 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందని కాగ్ పేర్కొంది.
ఇరిగేషన్, వైద్యం, పీఆర్ శాఖలకు 34 శాతం అధికంగా ఖర్చు పెట్టిందని తెలిపింది.
గృహ నిర్మాణం, పరిశ్రమలకు కేటాయింపు కంటే తక్కువ వ్యయం చేసిందని వెల్లడించింది. మౌళిక వసతులకు రూ.28,308 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ నివేదించింది. రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులకే సరిపోయాయని వివరించింది.
రాష్ట్ర ఆదాయం అంచనా రూ. 2,21,687 కోట్లుగా భావిస్తే.. రూ.1,74,154 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరిందని కాగ్ తెలిపింది. పన్నుల రూపంలో రూ. 1,09,992 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించింది. రెవెన్యూ లోటు రూ. 6,744 కోట్లు నుంచి రూ.9,335 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
మరోవైపు శాసన శాసనసభలో ప్రవేశపెట్టిన వస్తు, సేవల బిల్లు, మండలిలో ప్రవేశపెట్టిన టిమ్స్ బిల్లు ఆమోదం పొందాయి.