Congress : తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్ణాటక తరహాలోనే వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్లో తెలంగాణ పార్లమెంట్ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నేతలకు కీలక సూచనలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో నేతలు కలిసి పని చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితి, నేతల పని తీరుపై హైకమాండ్ నిత్యం మానిటరింగ్ చేస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. సర్వేల ప్రకారమే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. నియోజక వర్గాల వారీగా కేసీ వేణుగోపాల్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
పార్టీ నేతల్లో వేణుగోపాల్ ఆత్మవిశ్వాసం నింపారాన్నారు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ కు దగ్గరలో ఉందని అందరం కలిసి కష్టపడితే గెలుపు సాధ్యమని కేసి వేణుగోపాల్ చెప్పారన్నారు. సెప్టెంబర్ లో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జహీరాబాద్ ,మహబూబ్ నగర్ , నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో భారీ ఈ సభలు ఉంటాయని తెలిపారు. ఈ సభలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు.