భారత యువ ఆర్చర్ అదితి స్వామి సంచలన ప్రదర్శన చేసింది. సీనియర్ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలిసారి బరిలో దిగిన 17 ఏళ్ల అదితి సీనియర్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది.
బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్ లో అదితి మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. సెమీఫైనల్లోనే అదితి భారత సీనియర్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖకు షాక్ ఇచ్చింది. ఆమెను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. అదే జోష్ తో ఆడి ఫైనల్ లో గెలిచింది.
అదితి స్వస్థలం మహారాష్ట్రలోని సతారా. నెల క్రితమే మహిళల వ్యక్తిగత కాంపౌండ్లో అండర్-18 ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. జులైలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి కాంపౌండ్ ఆర్చర్ అదితే కావడం విశేషం. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి సీనియర్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.
శుక్రవారం జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల జట్టు విభాగంలో భారత్ తొలి స్వర్ణం గెలిచింది. జ్యోతి సురేఖ నాయకత్వం వహించిన ఆ జట్టులో అదితి కూడా సభ్యురాలే. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి గోల్డ్. వ్యక్తిగత విభాగంలో అదితి టైటిల్ గెలవడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. సెమీస్లో ఓడిన జ్యోతి సురేఖ మూడో స్థానానికి జరిగిన ప్లేఆఫ్లో గెలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది.