Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి నాగేళ్లు పూర్తైంది. జమ్మూ-కశ్మీర్, లద్ధాఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను రద్దు చేయగా.. నేటికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో జమ్మూ- కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
తనను గృహనిర్భందం చేశారని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయన్న కేంద్రం వాదన తప్పని మరోసారి రుజువైందని అన్నారు. ఆర్టికల్ 370 పై విచారణ సమయంలో ఈ పరిణామాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రధాన కార్యాలయానికి తాళం వేశారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆరోపించింది. మరోవైపు జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. దీంతో యాత్రికులు క్యాంపుల్లో ఆగిపోయారు.
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు మొదలయ్యాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.
ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశ ప్రజల తరపున మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.