రుణమాఫీ ప్రకటించిన చేసిన తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత నిధులను కూడా విడుదల చేసింది. రూ.37వేల నుంచి రూ.41వేల మధ్య రుణాలను మాఫీ చేస్తున్నట్టు మంత్రి హారీష్ రావు తెలిపారు. దీనికి సంబంధించి 237 కోట్ల 85 లక్షల రూపాయలను విడుదల చేశారు. దీంతో 62 వేల 758 మంది రైతులకు లబ్ధి చేకూరనుందంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ అంటే భారత రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితమైందన్నారు హరీష్ రావు.
ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. అయితే ఆయన చేసిన ట్వీట్లోనే మరో విషయం క్లారటీ ఇచ్చారు హరీష్ రావు. మొత్తం రుణమాఫీ 18 వేల 241 కోట్లు ఉందని ఆయన తెలిపారు. దీనికి ఆర్థికశాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విడుదల చేసిందన్నారు. కానీ మొదటి విడత కింద కేవలం 237 కోట్లను మాత్రమే రిలీజ్ చేయడమేంటన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అసలు మొత్తం 18 వేల కోట్లకు.. విడుదల చేసిన 237 కోట్లకు సంబంధం ఉందా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు.
తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కౌంట్డౌన్ కంటిన్యూ అవుతుండటంతో హడావుడిగా రైతు రుణమాఫీ చేస్తున్నారన్న విమర్శలు ఇప్పిటికే మొదలయ్యాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో సీఎం కేసీఆర్ అనూహ్యంగా రుణమాఫీ అంటూ ప్రకటించారు. గత నాలుగేళ్లుగా రైతులు అడుగుతున్నా జరగనిది ఇప్పుడు లోన్లు మాఫీకి సిద్ధపడుతుండడం కీలకంగా మారింది.
అంతేకాదు 37వేల నుంచి 41వేల మధ్యలో రుణాలున్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సర్కారు ప్రకటించిన 50వేల రుణమాఫీ ఉత్త మాటేనా మరో అనుమానం తెరపైకి వచ్చింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో 50 వేల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేసినట్లు పలువురు మంత్రులు గొప్పగా చెప్పారు. 2021 ఆగస్టు 1న జరిగిన కేబినెట్ భేటీలోనూ 25 వేల నుంచి 50 వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం 41 వేల వరకు మాత్రమే రుణమాఫీ చేశారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా కలిగిన లబ్ధిని వివరించే క్రమంలో రైతులకు 50 వేల వరకు రుణమాఫీ జరిగినట్లు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఫ్లెక్సీల్లోనూ డిస్ప్లే చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన సమాచార నివేదికలోనూ 50 వేల వరకు రుణాలున్న సొసైటీలకు, 36 వేల వరకు రుణాలున్న రైతులకు ఇప్పటికే మాఫీ చేసినట్లు ప్రకటించారు. కానీ తాజాగా మంత్రి ప్రకటనతో ఇప్పటివరకు మాఫీ అయింది 36 వేల వరకు రుణాలున్న రైతులకేనని స్పష్టమైంది.
రైతు రుణమాఫీ అనేది 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. అప్పటి నుంచి నిమ్మకు నీరేత్తనట్టు ఉన్న కేసీఆర్ సర్కార్.. ఇప్పుడు 45 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటోంది. దీంతో దీన్ని ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. దాదాపు 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది. మంత్రి ట్వీట్లోనే కేవలం 62 వేలకు లబ్ధి చేకూరిందని ప్రకటించారు. మరి మిగతా రైతుల సంగతేంటి? వారికి రుణమాఫీ ప్రభుత్వం చెప్పినట్టు జరుగుతుందా? అనేది వేచి చూడాలి.