Telangana Governor on Pending bills(Latest news in Telangana): టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇది ఆర్థిక బిల్లు . ఆ బిల్లును సభలో ప్రవేశ పెట్టాంటే గవర్నర్ అనుమతి కావాలి. ఇప్పటికే 3 బిల్లులను గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఇప్పుడు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడం ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచింది. ఆమె ఇంకా ఆ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసేందుకు బిల్లు రూపొందించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారని విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల వరకు ఆర్టీసీ విలీనంపై కాలయాపన చేస్తారని ఆరోపించాయి. అయితే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నారు కేసీఆర్.
ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని గులాబీ బాస్ భావించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చారు గవర్నర్ తమిళిసై. బిల్లుపై గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందని.. అందుకు కొంత సమయం పడుతుందంటూ రాజ్భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. దీంతో, ఆర్టీసీ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఇదే చివరి అసెంబ్లీ సెషన్ కావడంతో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అయ్యే ఛాన్సెస్ ఇక లేనట్టే. కేవలం ప్రకటనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది బీఆర్ఎస్ సర్కారు. ఇలా జరుగుతుందని ముందుగా తెలిసే చివరి రోజుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే, ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా మారకుండా గవర్నర్ అడ్డుకున్నారంటూ నెపాన్ని తమిళిసై మీదకు తోసేసి చేతులు దులుపుకుంటారా? చూడాలి.