తెలంగాణలో ఐటీ రంగం సాధించిన ప్రగతిని ఆ శాఖ మంత్రి కేటీఆర్ శాసన సభలో వివరించారు. రాష్ట్రంలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 6 లక్షలపైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.
హైదరాబాద్లో ఐటీని తామే అభివృద్ధి చేశామని కొంతమంది చెప్పుకుంటారని కేటీఆర్ సెటైర్లు వేశారు. కానీ తాము అలా చెప్పుకోమన్నారు. భాగ్యనగరానికి 1987లో ఇంటర్ గ్రాఫ్ అనే ఐటీ సంస్థ వచ్చిందని తెలిపారు. బేగంపేటలో ఆ సంస్థ మొట్టమొదటి ఐటీ భవనం ఉందన్నారు. అప్పటి నుంచి 2014 వరకు 27 ఏళ్లలో ఐటీ ఎగుమతులు రూ. 56 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్ వెల్లడించారు. కానీ గతేడాది ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు సాధించామని లెక్కలు వివరించారు. దేశంలో మొత్తం టెక్నాలజీ జాబ్స్లో 44 శాతం తెలంగాణలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని చిన్న నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరిగిన కేటీఆర్ సభలో విషయాన్ని ప్రస్తావించారు. కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్దలు కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్ అభివృద్ధి అర్థం చేసుకోవచ్చన్నారు. డైలాగులు, ధర్నాలతో ఇంత ధర రాదని స్పష్టంచేశారు. స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్షిప్ వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ శాసనసభ సమావేశాల రెండోరోజు ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలలకు సమయం కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వరదల తర్వాత జరిగిన పునరావాస సహాయక చర్యలపై అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే శాసనసభలో 10 కీలక బిల్లులు ప్రవేశపెట్టి.. శని, ఆదివారాల్లో ఈ బిల్లులపై చర్చించి ఆమెదిస్తారు. శాసన మండలిలో విద్య, వైద్యంపై చర్చ జరిగింది.