Madanapalle : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మదనపల్లెలో దుండగులు.. ఓ లెక్చరర్ ను కిరాతకంగా చంపేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
వేంపల్లె విద్యుత్తు ఉపకేంద్రంలో డ్యూటీ ఆపరేటర్గా పనిచేస్తున్న కదీర్ అహ్మద్ తో రుక్సానాకు 6 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆమె మదనపల్లె శ్రీజ్ఞానాంబిక జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహమైన 3 ఏళ్లు కూడా ఆమెకు పిల్లలు కలగలేదు. దీంతో ఆమె అనుమతితో కదీర్ అహ్మద్.. ఆయేషా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాదిన్నర క్రితం రుక్సానాకు ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి కదీర్ అహ్మద్ వద్దే రుక్సానా ఉంటున్నారు. అప్పటి నుంచి ఆయనకు రెండో భార్యతో గొడవలు జరుగుతున్నాయి.
మొదటి పెళ్లైన విషయం చెప్పకుండా కదీర్ తనను వివాహం చేసుకున్నారని అయేషా ఆరోపించారు. రుక్సానా ఇంటికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గొడవ చేశారు. తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు న్యాయస్థానంలో నడుస్తోంది.
కొన్నాళ్లుగా ఆయేషా సోదరులు రుక్సానా పని చేస్తున్న కాలేజీ వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రుక్సానా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మదనపల్లె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి బండిపై వెళుతుండగా ఇద్దరు యువకులు బైక్ వచ్చి ఆమెను అడ్డగించారు. కారం జల్లి గొంతులో పొడిచారు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు .. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు పారిపోయారు. దాడి తర్వాత రుక్సానా నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలారు.
హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ కేశప్ప, సీఐలు మురళీకృష్ణ, మహబూబ్ బాషా పరిశీలించారు. రుక్సానా తండ్రి మహమ్మద్ ఆలీ, సోదరి మస్తానీ ఘటన స్థలానికి చేరుకుని విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ గంగాధర్రావు.. మృతురాలి బంధువులను విచారించారు. రుక్సానాను పథకం ప్రకారమే హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయేషా సోదరుడు సులేమాన్, అతడి ఫ్రెండ్స్ అహ్మద్, ప్యారేజాన్లను అదుపులోకి తీసుకున్నారు.