వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే ప్రారంభించారు. మసీదుకు చేరుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా వారణాసిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సర్వేను నిలిపివేయాలని ముస్లిం కమిటీ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ మసీదును హిందూ ఆలయంపై నిర్మించారో లేదో తేల్చాలని ASIను ఆదేశించింది.
మరోవైపు అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది అంజుమన్ ఇంతెజామియా కమిటీ. అత్యవసర పిటిషన్ దాఖలు చేసి సర్వేపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరగనుంది. దీనికి కౌంటర్గా హిందూ సంస్థలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విచారణలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి. తమ వాదనలు వినకుండా తుది నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి. దీంతో మరోసారి జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది.
వారణాసిలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. అయితే ఈ మసీదు స్థానంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని.. 17వ శతాబ్దంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని పడగొట్టి దాని గోడలపైనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.