India Vs West Indies : విండీస్ టూర్ లో టీమిండియా చేస్తున్న ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదు. వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించారు. కానీ ఒక మ్యాచ్ లో ఓడి 2-1 తేడాతో మాత్రమే వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో హార్ధిక్ సేనకు షాక్ తగిలింది. పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
విండీస్ జట్టులో కెప్టెన్ రోవ్ మన్ పావెల్ (48), నికోలస్ పూరన్ (41), బ్రండన్ కింగ్ (28) రాణించారు. దీంతో ఆ జట్టు భారత్ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ , చాహల్ రెండేసి వికెట్లు, హార్ధిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (3), ఇషాన్ కిషన్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (21), కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ ( 39, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. అయితే సూర్య , తిలక్ 10 పరుగుల తేడాతో అవుట్ కావడంతో టీమిండియా 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (19), సంజు శాంసన్ (12) జట్టు స్కోర్ 113 పరుగులు వద్ద అవుట్ కావడంతో విండీస్ మ్యాచ్ పై పట్టు బిగించింది.
చివరికి టీమిండియా 20 ఓవర్లులో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో విండీస్ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. విండీస్ బౌలర్లు హోల్డర్, మెకాయ్, రోమారియో షెఫర్డ్ తలో రెండు వికెట్లు తీయగా.. అకీల్ హోసెన్ కు ఒక వికెట్ దక్కింది. భారత్ బ్యాటర్లు సంజు శాంసన్, అర్ష్ దీప్ సింగ్ రనౌట్ అయ్యారు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసిన హోల్డర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.