Kadem project : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా గేట్లు కూడా మొరాయిస్తునే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3 లక్షల 82 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5 లక్షల 9 వేల 25 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో జలాశయంపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది.
అసలు కడెం ప్రాజెక్టు నిజంగానే ప్రమాదంలో ఉందా అనే ప్రశ్నలకు అవును నిజమే అనేలా అక్కడి పరిస్థితులు తేల్చేస్తున్నాయి. గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు పంపించడం సాధ్యం కావడంలేదు. టాప్సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వచ్చిన వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు.
అయితే గేట్ల విడిభాగాలు లభించడంలేదని అధికారులు తెలియజేశారు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలన్నా వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తడానికి కనీసం 2 గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. దీంతో కొత్తగా రేడియల్స్ గేట్లు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే దీని కోసం అదనంగా లక్షా 5 వేల నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, స్పిల్ వే నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే గతేడాది సేఫ్టీ అండ్ రిహాబిలేషన్ ప్రోగ్రామ్ కింద నిపుణులతో రీసెర్చ్ చేయించినా ఇదే సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది.
ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది.