Kondai Floods : ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలకు వరదలు ఉగ్రరూపాన్ని దాల్చి.. ఊర్లకు ఊర్లనే ముంచేశాయి. వరదల బీభత్సానికి ప్రాణాలు కాపాడుకోవడానికి జనం పరుగులు పెట్టారు. అయినా ఒక్క వరంగల్ జిల్లాలోనే 33 మందిని వరదలు పొట్టనపెట్టుకున్నాయి. ఎంతో మంది చావు అంచుల వరకూ వెళ్లి బతికి బయటపడ్డారు. ఇంతటి ప్రళయం వేల కొంతమంది చేసిన సాహసం మరెంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. ములుగు జిల్లాలో ఓ గురుకుల ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి 40 మంది విద్యార్థులకు ప్రాణదానం చేసింది.
వారం క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో ములుగు జిల్లా మొత్తం అతలాకుతలం అయింది. అందులోనూ జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగటంతో ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామం జలదిగ్బందమైంది. వరదల స్థాయి పెరుగుతుందని ముందే ఊహించిన కొండాయి గురుకుల పాఠశాల హెడ్మాస్టర్ మీనయ్య, అందులోని 40 మంది విద్యార్థులను మల్యాల గ్రామంలోని తన ఇంటికి తీసుకెళ్లారు. పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిన అరగంటలోనే భారీ వరదలు ఆ స్కూల్ను ముంచేశాయి. 40 మంది పిల్లల ప్రాణాలు వరదల్లో బలి కాకుండా నిలబెట్టగలిగారు హెడ్మాస్టర్ మీనయ్య.
1986లో సైతం భారీ వరదలు వచ్చి కొండాయి గ్రామం మొత్తం మునిగిపోయింది. ఈ ఘటన గుర్తు తెచ్చుకున్న మీనయ్య తన ప్రాణాలతో పాటు 40 మంది పిల్లల ప్రాణాలు సైతం కాపాడారు. విద్యార్థులందరికీ తన ఇంటి దగ్గరే వసతి కల్పించి, భోజనం పెట్టారు. మీనయ్య సమయస్ఫూర్తితో వ్యవహరించటంతో, జలవిలయం నుంచి విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ ట్విట్టర్ ద్వారా హెడ్మాస్టర్ మీనయ్య సమయస్ఫూర్తిని అభినందించారు. ఆ ట్వీట్ను చూసిన మంత్రి కేటీఆర్.. రీట్వీట్ చేస్తూ.. చాలా గొప్ప పని చేశారంటూ మీనయ్యను ప్రశంసించారు.
మీనయ్య సమయస్ఫూర్తి ఎన్నో కుటుంబాలకు పుత్రశోకం కలగకుండా కాపాడింది. అంతేకాదు వరదలు తగ్గిన తర్వాత కూడా సాయం కొనసాగించారు. కొండాయి, మల్యాల గ్రామాల్లో తిరుగుతూ బాధితులకు తనవంతుగా అండగా నిలిచారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న మీనయ్యను ఆగస్టు 15న సన్మానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్ శాఖకు చెందిన హెల్పర్, లైన్మెన్తో పాటు, ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన మీనయ్య సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా అభినందించారు. ఆగస్టు 15న ముగ్గురికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరిస్తామని కేసీఆర్ ప్రకటించారు.