Chittoor Tomato : టమాటా ఇప్పుడు సామాన్యులకు బంగారంతో సమానమైంది. టమాటా పండిస్తూ కొందరు రైతులు కోటిశ్వరులవుతున్నారు. అదే సమయంలో ఎలాగైనా డబ్బు సంపాదించుకోవాలనే వారికి సులువుగా టార్గెట్ అవుతున్నారు. చిత్తూరు జిల్లా నక్కబండాలో ఇలానే ఓ రైతును టార్గెట్ చేసి దాడి చేశారు. అతని వద్ద ఉన్న నాలుగున్నర లక్షలను ఎత్తుకెళ్లారు.
రైతు లోకరాజ్ పండించిన టమాటా పంటను పలమనేరు మార్కెట్లో విక్రయించాడు. తిరిగి వస్తుండగా దారి కాచిన కొందరు యువకులు.. రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టారు. తన బైక్ ఆపడంతోనే అతనిపై దాడికి దిగారు. అతని వద్ద ఉన్న నాలుగున్నర లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. యువకుల దాడిలో లోకరాజ్కు గాయాలయ్యాయి.
గాయపడిన లోకరాజ్ను పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తనపై దాడి చేసిన యువకులు ఎవరో తనకు తెలియదని.. వాళ్లంతా గంజాయి మత్తులో ఉన్నారని చెబుతున్నాడు లోకరాజ్.
చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు టమాటా రైతులను హత్య చేశారు దుండగులు. ఇప్పుడు ఈ రైతుపై దాడి చేశారు. టమాటా పండించే వారి వద్ద డబ్బు ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతోనే ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని తెలుస్తోంది.