ఎకరం 100 కోట్లు. అవును, అక్షరాలా వంద కోట్ల రూపాయలు. సీఎం కేసీఆర్ చెప్పేది నిజమే. తెలంగాణ వచ్చాక భూములు బంగారమయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం భూమి కోట్లు పలుకుతోంది. ఇవన్నీ వట్టి మాటలు కాదు. లేటెస్ట్గా జరిగిన వేలంలో.. రికార్డు ధర పలికి.. కిరాక్ లేపింది కోకాపేట్.
కోకాపేటలో భూముల వేలం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో నియోపొలిస్లో భూములను HMDA వేలం వేయగా ఎకరం 60 కోట్లకు అమ్ముడుపోయింది. ఔరా అని అంతా ఆశ్చర్యపోయారప్పుడు. ఈసారి మరికొన్ని ప్లాట్లుకు యాక్షన్ నిర్వహించింది సర్కారు. ఓ ప్లాట్.. ఏకంగా ఎకరం 100 కోట్లు పలికింది. అది భూమినా? బంగారమా? అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
కోకాపేట నియోపొలిస్ భూముల వేలంలో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. పదో ఫ్లాట్లో ఎకరం 100 కోట్ల బిడ్డింగ్ పలికింది. ఏపీఆర్-రాజపుష్ప మధ్య పోటీ కొనసాగుతోంది. ప్రభుత్వం కనీస ధర ఎకరానికి 30కోట్లుగా నిర్ణయించింది. కాని అనుకున్న దానికంటే.. మూడు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోతున్నాయ్ కోకాపేట భూములు.
మొత్తం 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లకు వేలం ప్రక్రియ చేపట్టింది హెచ్ఎండిఏ. ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9, 10, 11, 14లో భూముల వేలం జరిగింది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుండి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసి ఆన్లైన్లో వేలం పాట నిర్వహించింది. ఒక ఎకరానికి అప్సెట్ ధర 35 కోట్లుగా నిర్ణయించారు.
గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం చేకూరింది. అప్పుడు ఎకరా భూమి విలువ 31 కోట్ల నుండి 60 కోట్ల ధర పలికింది. ఇప్పుడు ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ ఏకంగా ఎకరా భూమి ధర 100 కోట్లు పలికి అందరిని ఆశ్చర్యపరిచింది. కోకాపేటలో 45 ఎకరాల భూమి వేలం వేయడం ద్వారా రూ.3,319 కోట్ల ఆదాయం సంపాదించింది ప్రభుత్వం.
కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్లోనూ అదే స్థాయిలో హై రైజ్ అపార్ట్మెంట్లు నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్ రింగురోడ్డును అనుకొని ఉండటంతోపాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉండటం వల్ల ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. కోకాపేటా..కోట్లపేటా!
బంగారు బాతు గుడ్లు అమ్ముకున్నట్టు.. సర్కారుకు డబ్బులు అవసరమైనప్పుడల్లా విలువైన స్థలాలు వేలం వేస్తుండటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బంగారు తెలంగాణ అంటే ఉన్న భూములు అమ్ముకోవడమేనా? అని తప్పుబడుతున్నాయి. భవిష్యత్ తరాలకు సర్కారు స్థలాలు లేకుండా.. ఉన్నదంతా ఇప్పుడే అమ్మేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.