తెలంగాణలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న టార్గెట్ తో ఎన్నికల టీమ్ను సిద్ధం చేస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఏఐసీసీ నేతలు మురళీధరన్, బాబా సిద్దిఖీ, జిగ్నేష్లకు స్థానం కల్పించింది. స్క్రీనింగ్ కమిటీ ఎక్స్అఫిషియో మెంబర్లుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నియమించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణలో పార్టీకి బూస్టింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ రోజురోజుకు బలపడుతోంది. కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం పోటీ పెరుగుతోంది.
చాలా నియోజకవర్గాల్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్టీలో చేరే నేతలు టిక్కెట్ ఆశించడం సహజం. మరోవైపు ఆయా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీలో నేతల తమకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడతారు. ఈ సమస్యలను ముందే పరిష్కరించేందకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఆ జాబితాను పార్టీ హైకమాండ్ కు పంపుతుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపైనా కసరత్తు చేస్తోంది. గతేడాది రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ రెండు అంశాలు తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు. బీసీల్లో చేతువృత్తులవారికి రూ. లక్ష ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. ఇటీవల ముస్లింలకు రూ. లక్ష ఇచ్చే పథకాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో గులాబీ బాస్ లో కలవరం రేగింది. అందుకే తాజాగా రైతులకు రూ. లక్ష వరకు రుణ మాఫీని చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. మొత్తంమీద గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తూ కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళుతోంది. రోజురోజుకు ప్రజాబలం పెంచుకుంటోంది.