తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు మొదలవుతాయి. ముందుగా ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణా ఎజెండాను ఖరారు చేస్తారు.
అసెంబ్లీ సమావేశాలు 4 రోజులపాటు జరిగే అవకాశముందని తెలుస్తోంది. బీఏసీ భేటీలో ప్రతిపక్షాల సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాలను పొడిగించే ఛాన్స్ ఉంది. శాసన మండలిలో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నష్టాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో మండలి సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలో నిర్ణయిస్తారు.
తెలంగాణలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచిత విద్యుత్, ధరణి లాంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించాలని ప్లాన్ చేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, ధరణి పోర్టల్ లో లోపాలు, ఇటీవల వచ్చిన వరదలతో కలిగిన నష్టంపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులను అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ తిప్పిపంపిన 3 బిల్లులు ఇందులో ఉన్నాయి. ఈ బిల్లులపై శాసస సభ, మండలిలో మరోసారి చర్చించి ఆమోదిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టసవరణ బిల్లు–2022, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు.